||సుందరకాండ. ||

||తత్త్వదీపిక- ఏభైమూడవ సర్గ||

||"శీతో భవ హనూమతః"!||


||ఓమ్ తత్ సత్||

సుందరకాండ.
అథ త్రిపంచాశస్సర్గః||

తత్త్వదీపిక
'శీతో భవ హనూమతః'|
ఏబది మూడవ సర్గ

'శీతో భవ' అంటే 'చల్లబడు గాక' అని.
ఎవరు ?
'హనూమతః' |
అంటే'హనుమంతుడు చల్లబడుగాక", అని.

ఇది సీతమ్మవారి ప్రార్థన.

ఈ ప్రార్థన సాధారణ ప్రార్థన కాదు.
తన శక్తి నంతా ఉపయోగించి చేస్తున్న ప్రార్థన.

'యద్యతి పతి శుశ్రూషా' -అంటే 'నేనే పతికి శుశ్రూష చేసినదానినైతే! '.
'యద్యస్తి చరితం తప" అంటే 'నేను చేసిన తపము యొక్క బలమున్నచో !'.
'యది చాస్తేకపత్నీత్వం' అంటే" నేనే పతివ్రతని అయితే!'.
'యది వాభాగ్యశేషో మే' అంటే' నాకు భాగ్యము మిగిలి ఉన్నచో'!
'శీతో భవ హనుమతః' - హనుమంతుడు చల్లబడుగాక అని.
అంటే సీతమ్మ తన శక్తులన్నీ దావా పెట్టి,
హనుమంతుడు చల్లబడుగాక అని అగ్ని దేవుడికి ప్రార్థన చేస్తోందన్నమాట.

ఇలా సీతమ్మ తన శక్తులన్ని ఉపయోగించవలసి వచ్చిన కథ
ఎలాజరిగిందో మనము ఈ సర్గలో వింటాము.

క్రిందటి సర్గలో " న దూత వధ్యాం ",
అంటే దూతలను వధింపరాదు అని,
చెప్పిన విభీషణుని హితవాక్యములను ముందు తోసిపుచ్చినా,
రావణుడు చివరికి తన సమ్మతము చూపిస్తాడు.

ఈ సర్గ లో మొదటి శ్లోకము,
"తస్య తద్వచనం శ్రుత్వా దశగ్రీవో మహాత్మనః|
దేశకాలహితం వాక్యం భ్రాతురుత్తర మబ్రవీత్||" అని

అంటే తమ్ముడు విభీషణుని దేశకాలానుగుణమైన
హితవాక్యములను విని రావణుడు ఇలా చెపుతాడు అని.

' దూత వధ గర్హితము అని నీ చేత సముచితముగా చెప్పబడినది.
ఇతనిని వధించుటకన్న ఇతర దండన తప్పక విధించాలి'.

'వానరులకు వారి లాంగూలమే భూషణము, ప్రియము.
అందువలన అతని లాంగూలము కాల్చబడుగాక.
ఆ తోక దగ్ధముకాగానే అతడు శీఘ్రముగా వెళ్ళుగాక'.

'అప్పుడు ఆ అంగవైకల్యముతో దీన స్థితిలో నున్న అతనిని
బంధుమిత్రులు ఆప్తులు చూచెదరు.
అంటించగా మండుతున్న లాంగూలముతో
ఇతనిని నగరమంతా నాలుగు వీధులలోనూ రాక్షసులచే ఊరేగింప బడుగాక' అని.

అది రాక్షస రాజు రావణుడి ఆజ్ఞ.

రాక్షస రాజుయొక్క ఆ వచనములను వినిన రాక్షసులు,
హనుమంతుని లాంగూలమునకు పాతబడిన నూలు బట్టలు కట్టసాగిరి.
లాంగులము అలా కట్టబడుతున్నప్పుడు హనుమంతుడు
వనములో మోడువారి ఎండినచెట్లు దహించునఫుడు
అగ్నిపెరిగిన రీతిగా తన దేహమును పెద్దదిగా చేస్తాడు.

ఆ రాక్షసులు హనుమంతుని తోకను తైలము తో తడిపి నిప్పు అట్టించిరి.
బాల సూర్యునితో సమానముగా భాసిస్తున్నహనుమంతుడు,
ఆ మండుతున్న లాంగూలముతో రాక్షసులను కొట్టెను.

ప్రజ్వరిల్లుతున్న హనుమంతుని తోక చూచుటకు,
సంతోషపడిన రాక్షసులు బాలురు స్త్రీలు వృద్ధులు అనేకమంది అచటికి వచ్చిరి.
కౄరులైన రాక్షసులందరి చేత మరల బంధింపబడిన హనుమంతుడు మళ్ళీ ఇట్లు ఆలోచించెను.

'ఈ రాక్షసులచేత బంధింపబడినప్పటికీ నాకు శక్తిలో వీరు సమానులు కారు.
నేను మరల నా పాశములను ఛేదించి వీరందరిని హతమార్చగలను.
అలా చేసినచో నా రాజుయొక్క హితము కోరి తిరుగుచున్ననేను,
నా విధిని నిర్వర్తించడములో విఫలము కావచ్చు'.

'నన్ను ఈ రాక్షసులు వారి రాజు ఆదేశముతో బంధించితిరి.
యుద్ధములో ఈ రాక్షసులందరికీ నేను ఒక్కడినే చాలు.
రాముని ప్రీతికై నేను ఈ విధముగా మరల లంకను మళ్ళీ చూడడము అగును'.

'లంకా దుర్గ రక్షణా విధములను
రాత్రి తిరుగుచూ బాగుగా పరిశీలించలేదు.
అది ఇప్పుడు తప్పక చూడవలెను.
మళ్ళీ బంధించబడిన నన్ను
నా లాంగూలమును మండిస్తూ రాక్షసులు తప్పక బాధించెదరు.
కాని అది నా మనస్సుకు శ్రమ కాదు'.

అంటే రాముని దాసుడైన హనుమ,
రామకార్యార్థం రాక్షసుల బాధలను ఓర్చుకొడానికి నిశ్చయించుకున్నాడన్నమాట.
అలానిశ్చయించుకొని రాక్షసుల వశములో ఉన్నట్లు ప్రవర్తిస్తాడు.

అప్పుడు వశుడైనట్లు ప్రవర్తిస్తున్న ఆ మహబలవంతుడగు హనుమంతుని తీసుకొని,
ఆ రాక్షసులు, లంకా నగర వీధులలో ఊరేగించసాగిరి.
క్రూర కర్మణులైన రాక్షసులు ఆ హనుమంతుని ఆ నగరములో తిప్పుతూ
శంఖముల భేరీల నినాదముతో తమ గొప్పతనము చాటుకుంటూ,
హనుమ చారుడని చాటుచూ తిరుగుచుండిరి.

శత్రుమర్దనుడగు హనుమంతుడు రాక్షసులచే ఆ విధముగా తిప్పబడుచూ
ఆ మహా నగరమంతా చూచుచూ సుఖమును పొందెను.
అప్పుడు అ మహాకపి విచిత్రమైన భవనములను గోప్యమైన భూమి భాగములను,
చక్కగా తీర్చిదిద్దినట్లున్న రాజమార్గములను చూచెను.

పవనాత్మజుడు గృహములతో కిక్కిరిసిఉన్న వీధులను,
అలాగే విశాలమైన రాజమార్గములను,
చిన్న ఇళ్ళను, మేఘములను అందుకొనుచున్నట్లు ఉన్న ఎత్తైన గృహములను చూచెను.

ఆ రాక్షసులందరూ నాలుగు వీధులు కలిసే చోటులోను,
నాలుగుస్థంభములు కల మంటపాల వద్ద
ఆ వానరుని " లంకలో ప్రవేశించిన చారుడు" అని ప్రకటిస్తూ పోయిరి.
మండుతున్న తోకతో ఉన్న ఆ హనుమంతుని చూచుటకు,
కుతూహలము కొద్దీ స్త్రీలు బాలులూ వృద్ధులూ అచటికి చేరిరి.

అప్పుడు కొందరు రాక్షస స్త్రీలు
' హనుమంతుని తోకకు నిప్పంటింపబడినది' అను
అప్రియమైన మాటలను ఆ సీతా దేవికి వినిపించిరి.

'ఓ సీతా ! నీతో మాట్లాడిన ఎర్రని ముఖముకల వానరుడు,
లాంగూలమునకు నిప్పు అంటించబడినవాడై
లంకానగరమంతా తిప్పబడుచున్నాడు' అని.

హనుమంతుని తోకకి నిప్పు అంటించబడినది అన్నమాట
తనను అపహరింపబడిన విషయముతో సమానమైన మాట అని అనుకొనిన సీతమ్మ,
శోకములో మునిగిపోయి అగ్నికుండము వద్దకు వచ్చెను.
ఆప్పుడు ఆమె ఆ మహాకపి యొక్క శుభము కోరుచూ
ఆ హవ్యవాహనుని ఇలా ప్రార్థించెను.

' నేను పతిసేవాపరాయణురాలను అయితే,
తపస్సు చేసినదానను అయితే,
పతివ్రతను అయితే,
ఓ అగ్నిదేవా నీవు హనుమంతుని పై చల్లగా ఉండుము'.

'ధీమంతుడైన రామునికి నాపై కించిత్తు దయ ఉన్న ,
నాకు ఏమైన భాగ్యము ఉన్నా,
హనుమంతుని చల్లగా చూడుము'.

'ధర్మాత్ముడైన రాముడు నన్ను పతివ్రతగానూ,
తన సమాగమునకై వేచి ఉన్నదానిని గా భావిస్తే,
ఓ అగ్నిదేవా హనుమంతుని పై చల్లగా చూడుము'.

'ఆర్యుడు సత్యసంధుడూ అయిన సుగ్రీవుడు,
ఈ దుఃఖసాగరమునుంచి నన్ను రక్షించువాడైతే,
ఓ అగ్నిదేవా హనుమంతునిపై చల్లగా చూడుము'.

అంటే ఎంత దుఃఖములో ఉన్నా
తన శక్తిని తనకై ఉపయోగించని సీతమ్మ,
హనుమ కష్టములలో ఉన్నాడని అని భావించి,
తన శక్తిని దావా పెట్టి హుతాశనుని ప్రార్థించిందన్నమాట.

అప్పుడు ఈ విధముగా ప్రార్థింపబడిన అనలుడు
ఆ సీతమ్మకి కపి యొక్క క్షేమము తెలియచేస్తున్నాడా అన్నట్లు,
ఆ హుతాశనములో ఒక్కసారి ప్రజ్వలించెను.

తోకపై అగ్నికి తోడుగా వీచు, హనుమంతుని జనకుడు, అంటే వాయువు
దేవిచేత హనుమంతుని స్వాస్థతకై చేసిన ప్రార్థన విన్నట్లుగా చల్లగా వీచెను.
ఇది సీతమ్మకి శుభము.

అక్కడ ఆ లాంగూలము మండుచుండగా హనుమ చింతించ సాగెను.

' ప్రదీప్తిస్తున్న ఈ అగ్ని నన్నుఅంతా ఎందుకు దహించుటలేదు?
మహాజ్వాలలతో కనిపిస్తున్న ఈ అగ్ని నన్ను కోంచెము కూడా బాధించుటలేదు.
ఇంకా మండుతున్న లాంగూలము చివర మంచుముక్క పట్టినట్లు ఉన్నది.
నేను ఎగురుతూ వున్నప్పుడు రాముని ప్రభావముతో
సాగరములోనున్న పర్వతము నన్నుఆదరించినట్లు
ఇప్పుడు అగ్ని కూడా నన్ను ఆదరిస్తున్నాడేమో'.

'సీతదేవి యొక్క అనుగ్రహము వలన,
రాముని తేజస్సు వలన,
నా తండ్రి వాయుదేవుని స్నేహము వలన,
అగ్ని దేవుడు నన్ను దహించకుండా ఉన్నాడు'.

ఆ కపికుంజరుడు మరల చితించసాగెను.
వేగముతో పైకెగిరి మహా నాదము చేసెను.
ఆ అనిలాత్మజుడు ఆ విధముగా రాక్షసులనుంచి విడివడి,
పర్వత శిఖరముమల్లె నున్న నగర ద్వారముపై నిలబడెను.
తన పర్వత రూపము వీడి క్షణములో చిన్న రూపము పొంది,
తన బంధములనుంచి విడివడెను.

హనుమంతుడు అలా బంధ విముక్తుడై మరల పర్వతాకారము పొందెను.
అ హనుమంతుడు తోరణాశ్రితుడై అటూ ఇటూ వీక్షించి
అక్కడ ఉన్న పరిఘను చూచెను.
అప్పుడు ఆ మహాబాహువు అయిన ఆ మారుతి
ఆ ఇనుముతో చేయబడిన పరిఘను తీసుకొని ఆ రక్షకులందరినీ హతమార్చెను.

రణములో చండ విక్రముడైన ఆ హనుమంతుడు
ఆ రక్షకులను హతమార్చి మళ్ళీ లంకను చూస్తూ
అనేక కిరణములతో భాసించు సూర్యుని వలె భాసించెను.

ఇది మనము శ్రీమద్వాల్మీకి రామాయణములో సుండరకాండలో ఏభైమూడవ సర్గలో వినే కథ.

ఇక్కడ సీతమ్మగారి ప్రార్థన కొంచెము ఆలోచించతగినది.
ఆ ప్రార్థన ముందర సీతా హనుమంతుల సంబంధము విచారిద్దాము.

సుందరకాండ మొదటిలోనే హనుమంతుడు
జీవాత్మ పరమాత్మల కలయికకు కారకుడగు ఆచార్యస్వరూపముగా విన్నాము.
ఆచార్యస్వరూపములో జీవాత్మకి గురువుగా ప్రవర్తిస్తూ,
మరో మార్గములో ఉన్న జీవాత్మని అన్వేషించి,
ఆ అన్వేషణలో జీవాత్మను శిష్య రూపములో పరిక్షించి.
శిష్యునిలో వుండవలసిన లక్షణములు పరిశీలించి,
అన్వేషణలో అన్వేషింపబడిన జీవాత్మను శిష్యునిగా గ్రహించి,
అ శిష్యరూపములో వున్న జీవాత్మకి ఆచార్యరూపములో ఉన్న తనపై నమ్మకము కలిగించి,
తద్వార ఆచార్యుడు జీవాత్మ పరమాత్మలు ఏకము అవడానికి కారణమౌతాడు.

ఈ కథనములో హనుమంతుడు ఆచార్యస్వరూపములోనూ,
సీతమ్మ శిష్య స్వరూపములోనూ కనిపిస్తారు.

ఆచార్యుడు భగవానుడు శిష్యరూపములో వున్న జీవునకు రక్షకులు.
మోహముచే వారిని ఇద్దరినీ వదలుకొనిన శిష్యుడు, లేక జీవుడు, బంధనమున బడును.

గురువును భగవత్ సంబంధముతోనూ ,
భగవంతుని ఆచార్య సంబంధముతో చూడవలెను.
ఆచార్యుని ప్రసాదించినవాడు కనక భగవంతుడు శిష్యునకు ఆరాధ్యుడు.
అట్టి భగవానుని చేరుటకు సాయపడెడి వాడు ఆచార్యుడు,
కనక శిష్యునకు ఆచార్యుడు సేవింపతగినవాడు.

ఇక్కడ హనుమ యొక్క లాంగూలము దహింపబడుతున్నప్పుడు,
హనుమ శక్తి కలిగియూ ఆ వేడిని సహించుటకు నిశ్చయించుకొని ఊరకఉండెను.

కాని సీతమ్మ ఓర్వలేక తనప్రాణములే పోయినట్లు బాధపడి,
అగ్నిహోత్రుని ప్రతిజ్ఞలతో ప్రార్థించి చల్లబరచెను.

శిష్యాచార్యులలో శిష్యుడు ఆచార్యుడు,
ఒకరితో నొకరు ఎట్టిసంబంధము కలిగు యుండవలెనో ఈ సన్నివేశము విశదము చేస్తుంది,

శిష్యుని ఆత్మ రక్షణకి ఆచార్యుడు బాధ్యత వహింపవలెను.
గురు సన్నిధిలో ఉన్న శిష్యుడు తన రక్షణకై చింతింప అవసరము లేదు.

భగవదనుగ్రహముచే జ్ఞానానుష్ఠానములు కల ఆచార్యుడు లభించిన పిమ్మట,
తనకేమి లోటులేదని, భగవత్ప్రాప్తి తథ్యమనే ధైర్యముతో నుండవలెను.
భగవత్ప్రాప్తికై ఆర్తితో తన ప్రయత్నములో ఉండుట తప్ప వేరొక ప్రయత్నము చేయరాదు.

అలాగ సీతమ్మ రామునిపై బాధ్యతవేసి
రావణుని చంపుటకు తన శక్తిని వినియోగింపలేదు.
ఆమె పాతివ్రత్య మహిమ కలది.
ఆ పాతివ్రత్య మహిమతోరావణుని దహింపగల శక్తి కలది.
హనుమ మాటలు విని, రాముడే వచ్చి తనను రక్షించునని ధైర్యముతో ఉండెను.

కాని ఇక్కడ హనుమను రక్షించుటకు తన పాతివ్రత్య మహిమ ఉపయోగించెను.

గురువు అనుగ్రహములో ఉన్న శిష్యుడు ,
గురువు యొక్క శరీరము పదిలముగా ఉండునట్లు చూచుకొనవలెను.
గురువు శరీరములో ఉన్నంతకాలము గురువు శిష్యుని రక్షించు చుండును.
అందుచే శిష్యుడు గురువు రక్షణకు తన శక్తిని వినియోగింపవలెను.
అందుచే శిష్య స్వరూపములో ఉన్న సీత హనుమద్రక్షణకై తన శక్తిని వినియోగించెను.

భగవదనుగ్రహము పొంది, భగవదాజ్ఞచే జీవనము సాగిస్తున్న ఆచార్యుడు,
శరీరము ప్రధానముగా భావింపరాదు.
భగవంతుని ప్రీతికై కష్టములు సహించుటకైననూ సిద్ధపడి యుండవలెను.
అవసరమైతే భగవంతుడే రక్షించునని ఉండవలెను.
ఇదే మనము హనుమంతునిలో చూస్తాము.
హనుమ రాక్షసులు తనను బాధపెడుతున్నావారికి వశుడైనట్లు గా ప్రవర్తిస్తూ,
లంకానగరమంతా రామకార్యార్థము రాక్షసుల బందీగా మళ్ళీ తిరిగెను.

ఈ విధముగా గురువు శిష్యులు తమ రక్షణ విషయములో
ఎట్లు ప్రవర్తింపవలెనో అన్నమాట హనుమంతుడు సీత తమ ప్రవర్తనలతో నిరూపిస్తారు.

సీతమ్మ చెప్పిన నాలుగు ప్రార్థనా శ్లోకములు ప్రధానమైనవి.

యద్యసి పతిశుశ్రూషా యద్యస్తి చరితం తపః|
యది చాస్త్యేకపత్నీత్వం శీతో భవతు హనూమతః||28||
యదికించిదనుక్రోశః తస్య మయ్యస్తి ధీమతః|
యది వా భాగ్యశేషో మే శీతో భవతు హనూమతః||29||
యది మాం వృత్తి సంపన్నాం తత్సమాగమ లాలసాం|
స విజానాతి ధర్మాత్మా శీతో భవతు హనూమతః||30||
యది మాం తారయేదార్యః సుగ్రీవః సత్యసంగరః|
అస్మాదుఃఖామ్బుసంరోధాత్ శీతో భవ హనూమతః||31||

ఈ నాలుగు శ్లోకాలు శాంతిని ప్రదానము చేసే శ్లోకాలు.

ఇంకోమాట.

రాముని దూత హనుమ.
హనుమ పట్టుకొనబడి రావణుని ముందరకు తీసుకురాబడతాడు.
అప్పుడు మనము రావణుడు ఎలా వ్యవహరించాడో చూశాము.

ఇలాంటి సన్నివేశం మళ్ళీ యుద్ధకాండలో రాముడి సమక్షములో జరుగుతుంది.
వానరసేనతో రాముడు సాగరము దాటి లంకానగరానికి చేరుతాడు.
అప్పుడు వానరసైన్యము గురించి తెలుసు కోడానికి,
రావణుడు శుక సారణులు అనే చారులు ఇద్దరిని పంపిస్తాడు.
వానర శిబిరాలలో తిరుగుతున్న ఆ చారులిద్దరినీ
విభీషణుడు పట్టుకొని రాముని ముందరకు తీసుకువస్తాడు.
అప్పుడు రాముడు చెప్పిన మాట వినతగ్గది.

"న్యస్త శస్త్రౌ గృహీతౌ వా
న దూతౌ వధం అర్హతః"
అంటే "శస్త్రములను విసర్జించిన లేక పట్టుకొనబడిన దూతలను వధించ రాదు"అని.

రాముడు ఈ మాట విభీషణునికి చెప్పి,
ఆ దూతలను వారికి కావలసిన సమాచారము సేకరించారా అని అడుగుతాడు.
పైగా వారికి ఇంకా కావలసిన సమాచారము వుంటే,
అది చూపించి మరీ వదలమని విభీషణునికి ఆదేశమిస్తాడు.

అది రాముని ఆజ్ఞ

రావణుని ఆజ్ఞ, రాముని ఆజ్ఞ విచారింపతగినవి.
రావణుడు కూడా రాముడి లాగ వేదములన్నీ చదివినవాడని వింటాము.
కాని ఈ ఆజ్ఞల ద్వారా మనకి విదితము అయ్యేది
రావణుడు ధర్మాధర్మములే కాక దయా దాక్షిణ్యము కూడా లేనివాడు అని విదితమౌతుంది.

ఇదే ఏబది మూడవ సర్గ లో మనము వినే కథ.

ఈ విధముగా శ్రీమద్వాల్మీకి రామాయణములో సుందరకాండలో ఏబది మూడవ సర్గ సమాప్తము

|| ఓమ్ తత్ సత్||
|| ఇది శ్రీభాష్యం అప్పలాచార్యులవారి తత్త్వగీతలో మాకు తెలిసినమాట||
||ఓమ్ తత్ సత్||